వైఎస్ ఇచ్చిన మాట ఏమైంది?


నరసాపురం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: మరో ఐదేళ్ల వరకూ విద్యుత్ చార్జీలను పెంచేది లేదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కారు తుంగలోకి తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్ ఇచ్చిన మాటతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా ప్రజలపై రూ.4 వేల కోట్ల కరెంటు చార్జీల భారం మోపారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే వైఎస్ చనిపోయారని, ఆ తర్వాత వచ్చిన పాలకులు సిగ్గులేకుండా చార్జీలను పెంచారని ధ్వజమెత్తారు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో సోమవారం జగన్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల జరిగిన సభల్లో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం జరిగే ధర్నాలో అందరూ పాల్గొనాలని, రాష్ట్రవ్యాప్తంగా సబ్‌స్టేషన్ల ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ ఓటు పాలకులకు కనువిప్పు కావాలి..

‘‘మనం వేసే ప్రతి ఓటు రైతన్నకు వేసే ఓటు, పేదవాడికి వేసే ఓటు.. ఈ ఓటుతో గ్రామాల్లో రైతన్న ఎలా బతుకున్నాడు, పేదవాడు ఎలా బతుకుతున్నాడో పాలకులకు తెలియాలి.. కనువిప్పు కలగాలి. వారికే కాదు రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్న ఢిల్లీ పెద్దలకు కూడా కనువిప్పు కావాలి..’ అని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కావని, రెండు పార్టీల మధ్య జరుగుతున్నవి అంతకన్నా కావని చెప్పారు. రైతన్న, పేదవాడు ఒకవైపు ఉంటే కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయు వ్యవస్థ మరోవైపు ఉందని, విలువలు, విశ్వసనీయుత ఒకవైపు ఉంటే వంచనతో కూడిన రాజకీయూలు మరోవైపున నిలిచాయని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేస్తే ప్రజల తరఫున నిలబడినట్లు అవుతుందని అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తన వద్దకు వచ్చిన నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్‌కు చెప్పానన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే పదవులు పోతాయని తెలిసినా విలువల కోసం కట్టుబడి ఓటు వేశాడని చెప్పారు. 

‘‘రాజకీయాల్లో పదవులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ప్రతి పేదవాడు మనవైపు చూస్తున్నాడు.. ప్రతి రైతన్నా మనవైపు చూస్తున్నాడు.. ఇలాంటి రాజకీయు వ్యవస్థలో ఒక తులసి మొక్కలా మనం బయటకు రావాలి’’ అని చెప్పినట్లు గుర్తు చేశారు. చెడిపోయిన రాజకీయు వ్యవస్థలో మళ్లీ విలువలను తీసుకురావాలని, పలానా వాడు తమ నాయకుడని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకునేలా ఉండాలని ప్రసాద్‌తోపాటు 17మంది ఎమ్మెల్యేలకు చెప్పానని తెలిపారు. నా మాటను గౌరవించి వారంతా పదవులు త్యాగం చేశారన్నారు. రైతుల, పేదల పక్షాన నిలబడ్డ ఆ ఎమ్మెల్యేలను ఆశీర్వదించాలని కోరారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హరిరామజోగయ్య

నరసాపురంలో మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జోగయ్యతోపాటు పలువురు నేతలు, వందలాది మంది కార్యకర్తలు పార్టీలోకి చేరారు.

కుష్ఠు రోగులను పలకరిస్తూ..

రుస్తుంబాదలో ఉన్న లెప్రసీ కాలనీ వద్ద కుష్ఠు రోగులు బయటకు వచ్చి జగన్ వాహనాన్ని ఆపారు. ఆయన కిందకు దిగి వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రోగులను ఆలింగనం చేసుకుని ముద్దాడారు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ తమ వద్దకు ఏ నాయకుడూ రాలేదని, తమును పలుకరించే వారే కరువయ్యూరని వారు విలపించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ఎవరూ అధైర్యపడవద్దని జగన్ వారిని ఓదార్చారు. అనంతరం సీతారామపురం వంతెన, కొత్తపేటలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. రామన్నపాలెం, పసలదీవిలో గీత వృత్తి చేసే కుటుంబాన్ని పలుకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జెట్టిపాలెం, పసలదీవి, మెట్టిరేవు, కేపీ పాలెం వరకూ రోడ్ షో నిర్వహించారు. జగన్ వెంట నరసాపురం తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోషేన్‌రాజు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు చెరకువాడ శ్రీరంగనాథరాజు, పాతపాటి సర్రాజు, పార్టీ జిల్లా పరిశీలకులు చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.


అడుగడుగునా ఆదరణ..

ఉదయం 10 గంటలకు నరసాపురం పట్టణంలో రోడ్‌షో ప్రారంభించిన జగన్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సాయినాథ్ ప్రసాద్ నివాసం నుంచి బయలుదేరిన జగన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లూథరన్ చర్చికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టింది. దారి పొడవునా మహిళలు, యువకులు ఆయన వాహనాన్ని ఆపి చేయి కలపడానికి ప్రయత్నించారు. ఎవరినీ కాదనకుండా జగన్ అందరికీ అభివాదం చేస్తూ, చేయి కలుపుతూ ముందుకు సాగారు. మధ్యలో వనుమలమ్మ గుడి సమీపంలో చేనేత కార్మికుల్ని కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More