రిలయన్స్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌లను బ్లాక్ మెయిల్‌చేసి కోట్లు

రాజమండ్రి, న్యూస్‌లైన్ : జననేత జగన్‌మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న అమలాపురం ఎంపీ హర్షకుమార్ తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండేటి చిట్టిబాబు, మట్టా శైలజ హితవు పలికారు. జగన్‌ను అరెస్టు చేయాలన్న హర్షకుమార్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో గడపగడపకూ జగన్ అవినీతి పేరుతో రాజమండ్రిలో ర్యాలీలు నిర్వహించడంపై వారు మండిపడ్డారు. రాజకీయాలోకి రాకముందు హర్షకుమార్ ఆస్తి ఎంత, ఇప్పుడు కూడబెట్టిన ఆస్తులెన్ని అనే విషయం లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు.

హర్ష తన స్థాయిని మరచి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హర్షకుమార్ రాజమండ్రిలో కళాశాలల పేరుతో భూములు ఆక్రమించారని, ఓ ఆశ్రమ నిర్మాణం పేరుతో భూ కబ్జాకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. రిలయన్స్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌లను బ్లాక్ మెయిల్‌చేసి కోట్లు గడించారని విమర్శించారు. సఖినేటిపల్లి -నరసాపురం వంతెన నిర్మాణానికి అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకున్న హర్ష తన పదవీకాలంలో కోనసీమకు చేసిన మేలంటూ లేదన్నారు. మద్యం ఎమ్మార్పీ ధర ల ఉద్యమం పేరుతో డబ్బులు దండుకున్న హర్షకుమార్ ఎంపీ ల్యాడ్ నిధులతో జరిగే పనుల కాంట్రాక్టుల్ని తెలుగుదేశం వ్యక్తులకు ఇచ్చి ఆ పార్టీతో కుమ్మక్కయ్యారన్నారు. 

కోటిపల్లి నర్సాపురం రైల్వేలైను ప్రతిపాదనలు అటకెక్కడానికి హర్ష మూలకారకుడని విమర్శించారు. రాజమండ్రిలో కూర్చుని రాజకీయాలు చేసే హర్షకుమార్‌కు నియోజక వర్గం లో ఎవరితోనూ సత్సంబంధాలు లేవని ఆనంద్‌సాగర్, చిట్టిబాబు అన్నారు. జగన్‌కు అశేష జనాదరణ చూసి సహించలేకనే హర్షకుమార్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే శైలి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More