తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఉద్ఘాటన
* ఒక నాయకుడి మతం, కులంపై మాట్లాడే స్థాయికి రాజకీయాలు దిగజారాయి
* పేదలు, రైతులకు అండగా ఉన్నందుకే 17 చోట్ల ఉప ఎన్నికలు
* తన స్వార్థం కోసం చిరంజీవి తిరుపతి ప్రజలను గాలికొదిలేశారు
* ప్రజారాజ్యం పార్టీని హోల్సేల్గా కాంగ్రెస్కు అమ్మేశారు
* నన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించానంటున్నారు
* సంతకాలు చేయించే ఉంటే.. ఆనాడే చంద్రబాబులా వారిని వైస్రాయ్ హోటల్కు తీసుకెళ్లేవాడిని.. సీఎంగా ప్రమాణం చేసేవాణ్ణి
* నేను సీఎం కావాలని ఎవరు సంతకాలు పెట్టించారో చెప్పండి
* నాడు రోశయ్యను సీఎంగా ప్రతిపాదించింది నేను కాదా?
తిరుపతికి గాలేరు-నగరి తెస్తా
‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా.. చనిపోయాక కూడా పేదవాడి గుండెల్లో
నిలిచేలా బతకాలన్న తపన, తాపత్రయం నాలో ఉన్నాయి. అందుకే చెబుతున్నా రాబోయే
సువర్ణయుగంలో తిరుపతికి గాలేరు-నగరి తెస్తా.. తాగునీటి సమస్య తీరుస్తా’’ -
జగన్మోహన్రెడ్డి
![](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_tWKkTJEs4-yWbXsBPxAZEEaD604XEHE8zyQ9wYGKDh0FarkKey4AowtgdIHXlBqP_cW0AoPiTx4MujLwe0agp5HPDpc6cXFVjpE1q7hnLNDrRoVnYeia_QcFceXwmwj47RvBAO-YuAvWhIw8n7dn4=s0-d)
తిరుపతి, న్యూస్లైన్: ‘గత రెండేళ్లుగా చూస్తున్నా.. టీడీపీ అధినేత
చంద్రబాబుకుగాని, కాంగ్రెస్ పెద్దలకుగాని ప్రజలు, వారి సమస్యలూ కనిపించడం
లేదు. రెండేళ్లుగా వీరు చేస్తున్నదేంటంటే.. జగన్ను, వైఎస్ రాజశేఖరరెడ్డిని
ఎలా అప్రతిష్టపాలు చేయాలీ.. వారిపై ఎలా బురదజల్లాలీ అని కుట్రలు పన్నడం
మాత్రమే. చివరకు వీరు ఏ నీచస్థాయికి దిగజారిపోయారంటే.. జగన్ కులమేంటి? జగన్
మతమేంటి? అని నిస్సిగ్గుగా మాట్లాడే పరిస్థితికి వచ్చేశారు’ అంటూ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి
నిప్పులు చెరిగారు. పేదవాడు ఎలా బతుకుతున్నాడు..? వారికి ఎలా మేలు చేయాలీ
అన్న ఆలోచనే మానేసి ఇలా దిగజారి మాట్లాడుతున్నచంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు
తమ వ్యక్తిత్వం గురించి తమను తాము ఒకసారి ప్రశ్నించుకోవాలని ఆయన
సూచించారు. ‘‘ఇవాళ చెబుతున్నా.. నా మతం మానవత్వం. నా కులం ప్రతి పేదవాడి
గురించి తపించే కులం’’ అని జగన్ ఉద్ఘాటించారు. ఉప ఎన్నికలు జరుగనున్న
తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిభూమన
కరుణాకరరెడ్డి తరఫున జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రచారం ప్రారంభించారు.
ఆయన్ను చూసేందుకు.. చెమటలుకక్కే మండుటెండలో సైతం తిరుపతి రోడ్లపై జనం
కిక్కిరిశారు. జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలడం
కష్టంగా మారింది. ఆయన ప్రసంగిస్తుంటే.. ఈలలు, తప్పట్లతో హర్షాతిరేకాలు
వ్యక్తంచేశారు. తిమ్మినాయుడు పాళెం పంచాయతీ నుంచి ప్రచారం ప్రారంభించిన
జగన్.. తొలిరోజు మొత్తం 13 జంక్షన్లలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా మే
డే జరుపుకొంటున్న కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలో
శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేశారు. ఈ పర్యటనలో జగన్ ప్రసంగాల
సారాంశం ఆయన మాటల్లోనే..
చిరంజీవి స్వార్థం వల్లే తిరుపతిలో ఉప
ఎన్నికలు: రైతన్నకు, పేదోడికి అండగా నిలబడితే పదవులు పోతాయని తెలిసినా..
నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలు చేసినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు
గురయ్యారు. అందువల్లే ఆ 17 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ తిరుపతిలో
చిరంజీవి స్వార్థం కోసం ఉప ఎన్నికలు వచ్చాయి. చిరంజీవే స్వయంగా చెప్పారు..
సోనియా గాంధీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చారట.. అందుకని ఇక్కడి ప్రజల్ని
గాలికొదిలేసి ఆయన రాజ్యసభకు వెళ్తున్నారట. తిరుపతిలో నాలుగురోజులకోసారి
నీళ్లు ఇస్తున్నారని, ప్రభుత్వం నీటి ఎద్దడి పరిష్కరించలేదని చిరంజీవి
రాజీనామా చేసుంటే సంతోషించేవాళ్లం. ఆయనకు నేను కూడా సెల్యూట్ చేసి
ఉండేవాణ్ణి. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కుదించారని, 108కు ఫోన్ చేసినా వాహనం
వచ్చే పరిస్థితి లేదని రాజీనామా చేసుంటే అభినందించేవాళ్లం. రంగారెడ్డి
జిల్లాకు చెందిన వరలక్ష్మి లాంటి పేద అమ్మాయి చదువుకోలేక, ఫీజు కట్టలేక
ఆత్మహత్యకు పాల్పడింది. అలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని రాజీనామా
చేసుంటే గర్వపడుండేవాళ్లం. పదవి కోసం, కావాల్సిన వారికి మంత్రి పదవులు
ఇప్పించుకునేందుకు చిరంజీవి హోల్సేల్గా తన పార్టీని కాంగ్రెస్కు
అమ్ముకున్నారు. ఇప్పుడు చెప్పండి స్వార్థపరుడు చిరంజీవా, నేనా?
చిరంజీవి ఎప్పుడూ నాపై నింద వేస్తూనే ఉన్నారు: చిరంజీవి మాటిమాటికీ నా మీద
ఏదో ఒక నింద వేస్తూనే ఉన్నారు. ఆ వేళ నాన్న చనిపోయినప్పుడు.. నన్ను సీఎంగా
చెయ్యాలంటూ 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో నేను సంతకాలు చేయించానని
అంటున్నారాయన. ఆ 150 మందికిపైగా ఎమ్మెల్యేల్లో కొంతమంది చిరంజీవి వద్దకు
బహిరంగంగా అందరికీ తెలిసేటట్లుగా వెళ్లి.. వాళ్లందరినీ(పీఆర్పీ
ఎమ్మెల్యేలందరినీ) నాకు మద్దతు తెలపాలని అడిగినట్లు చిరంజీవి ఎప్పుడూ
చెప్తూ ఉంటారు. దీనిపై చిరంజీవిని మా పార్టీ వాళ్లు చాలాసార్లు ఎదురు
ప్రశ్నించారు. ఆయన వద్దకు వచ్చిన వారెవరో చెప్పాలని పదే పదే అడిగారు.
‘సాక్షి’లో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని వేస్తూ వచ్చారు. అయితే ఆ ప్రశ్నలకు
చిరంజీవి సమాధానం చెప్పలేదు. ఇప్పుడేమో బాబు కూడా చిరంజీవి మాటే
మాట్లాడుతున్నారు.
కొంచెమైనా జ్ఞానముందా చిరంజీవీ?: నన్ను సీఎంగా
చేయాలని 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించే దుర్బుద్ధే నాకు
ఉంటే.. చంద్రబాబు నాయుడిలా వాళ్లందరినీ ఆ నాడే వైస్రాయ్ హోటల్కు
తీసుకెళ్లిపోయేవాణ్ణి.. ఆ వెంటనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవాణ్ణి.
అయ్యా చంద్రబాబూ.. ఆ రోజు ఎవరు సంతకాలు చేయించారో నాకు తెలీదు. మీకు
తెలిస్తే మీరైనా చెబితే సంతోషిస్తాను. అయ్యా చిరంజీవిగారూ.. కొంతమంది
ఎమ్మెల్యేలను మీ వద్దకు పంపించి మద్దతు కోరానని మీరు చాలాసార్లు అన్నారు. ఆ
రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలను
మీ దగ్గరకు అలా బహిరంగంగా పంపించానని సోనియాకు తెలిస్తే.. నన్ను ఎలా సీఎం
చేస్తారయ్యా? నీకు కొంచెమైనా జ్ఞానముండాలి కదయ్యా చిరంజీవి ఆ మాట
మాట్లాడ్డానికి.
ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంనవుతా: చంద్రబాబుకు,
చిరంజీవికి ఇద్దరికీ చెప్తున్నా.. మీ మాదిరిగా నేను అధికారం కోసం ఏ
గడ్డయినా తినేవాణ్ణికాదు. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచే
చరిత్ర నాకు లేదు చంద్రబాబూ! ఓటేసిన 70 లక్షల మంది ప్రజల్నీ స్వార్థం కోసం
నట్టేట ముంచిన చరిత్ర నాదికాదయ్యా చిరంజీవి.. అది నీదేనయ్యా. అధికారం అనేది
దేవుడు నా నుదుట రాసిపెడితే.. అదెలా ఉంటుందీ అంటే.. పేదవాడి కొరకు, ప్రజల
కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. నా
నైజం, నా గుణగణాలు ఇవే. ఈ మాదిరిగా నేను సీఎం అవుతానేకాని... మీలాగా
దొడ్డిదారిన పదవి చేపట్టాలని తాపత్రయపడను. ఇవాళ చంద్రబాబును నేను ఒక్క మాట
అడుగుతున్నా.. ఆ వేళ నేనే కదయ్యా రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిందీ
అని అడుగుతున్నా.
అందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు: ఇవాళ అధికారం
కోసం వెంపర్లాడుతూ నా మీద రోజుకో మాట మాట్లాడుతున్నారు. రోజుకో నింద
వేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేశారు. అటు సోనియా గాంధీ వైపు నుంచి
కాంగ్రెస్వాళ్లు, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ కాంగ్రెస్ వాళ్లతో కలిసి
దాడి చేస్తున్నారు. వాళ్ల దగ్గర అధికారం ఉంది. వాళ్ల దగ్గర ఉన్న వ్యవస్థలను
అడ్డగోలుగా నా మీదకు ఉసిగొల్పుతున్నారు. మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి,
టీవీ9 అంతా కలిసి దాడి చేస్తున్నారు.. నన్ను ఒక్కడిని చేసి వీరందరూ ఒక్కటై
దాడి చేస్తున్నారు. రోజుకో కట్టు కథ.. రోజుకో అబద్ధం. రోజూ చెప్పిందే
చెప్పి దుష్ర్పచారం చేసి ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నారు.
నన్ను ఒక్కడిని చేసి మీరంతా ఏకం కావచ్చు. నా దగ్గర రాజ్యాలు లేకపోవచ్చు..
మద్దతిచ్చే రాజులు లేకపోవచ్చు.. నా దగ్గర గుర్రాలు లేకపోవచ్చు. కానీ పై
నుంచి ఆ దేవుని ఆశీస్సులు, నాన్నను ప్రేమించే ప్రతి గుండే నా వెంటే ఉందని
చెప్తున్నా.
మీ ఓటు మార్పునకు నాంది: త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో
పేదవాడు, రైతు ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉండి పోటీ పడుతున్నాయి.
మీరు వేసే ఓటుతో ఈ రాష్ట్రాన్ని రిమోట్తో పాలిస్తున్న ఢిల్లీ పాలకుల
దిమ్మ తిరగాలి. మీరు వేసే ఓటు రాష్ట్రంలో మార్పు తేవాలి. ఆ మార్పుతో
రాష్ట్రంలో త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు సువర్ణయుగం వస్తుంది.
ప్రతి అక్క, అన్న.. తమ తమ్ముడు సీఎం అయ్యాడని, ప్రతి చెల్లెలు, ప్రతి
తమ్ముడు తమ అన్న సీఎం అయ్యాడని.. ప్రతి అవ్వా, తాత తమ మనవడు సీఎం అయ్యాడని
అనుకునే విధంగా, ప్రతి రైతు, పేదవాడు కాలర్ ఎగరేసేలా ఆ సువర్ణయుగం ఉంటుంది.
ఏటా పేదలకు 10 లక్షల ఇళ్లు కట్టించే విధంగా పాలన ఉంటుంది.
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్
తిరుమల: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం జగన్ రాత్రి 8.55
గంటలకు తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ఆయన శ్రీవారిని
దర్శించుకోనున్నారు.
0 comments:
Post a Comment