హైదరాబాద్, న్యూస్లైన్:
వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నాయకుడి నేతృత్వంలో ఎమ్మెల్యే కావడం తన అదృష్టమని కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండవ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టినందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. గురువారం ఉదయం శాసనసభలో పదవీ ప్రమాణం చేశాకమీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు ఎస్వీ మోహన్రెడ్డి, నారాయణరెడ్డి, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తొలి ఎమ్మెల్యేగా విజయమ్మగారు గెలిచారు. రెండో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. ఒకటి.. రెండు అయింది. రేపు ఉప ఎన్నికలు జరగబోయే 18 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలవబోతోంది. అప్పుడు 20 అవుతాయి. ఇక ఎప్పుడు సాధారణ ఎన్నికలొచ్చినా 222 స్థానాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తుంది. ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం’ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎన్.టి.రామారావు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే ప్రజాకర్షణ కలిగిన నాయకులుగా ఉండేవారని.. ఆ తర్వాత అంతటి ప్రజాకర్షణ కలిగిన ఏకైక వ్యక్తి జగన్ అని నల్లపరెడ్డి కొనియాడారు. ‘నెల్లూరు జిల్లాలో పెన్నా నది ప్రవహిస్తున్నట్లే.. కోవూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు రెండూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని.. డబ్బు, మద్యం ఏరులై పారించినా ప్రజలు జగన్ను, నన్నే ఆదరించారు ’ అని తెలిపారు. కాగా, గురువారం సభ ప్రారంభం కాగానే స్పీకర్.. కోవూరు నుంచి ఎన్నికైన ప్రసన్నను అభినందిస్తూ.. ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించారు. ఆయన తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రసన్న ప్రమాణ స్వీకారం తర్వాత సభ వాయిదాపడటంతో ఆయన బయటకు వస్తున్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు లాబీల్లో ఎదురు పడ్డారు. ప్రసన్నను దూరం నుంచే గమనించిన బాబు ముఖం తిప్పేసుకుని వెళ్లి పోయారు.





0 comments:
Post a Comment