మనమే ప్రతిపక్షం..: వైఎస్ జగన్

ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమాన ఎమ్మెల్యేలే గట్టి ప్రతిపక్షంగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. ఆయన మంగళవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఒక ఎం.పి,16 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హాజరైన ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించాయన్నారు. ప్రధాన ప్రతిపక్ష భాద్యతను వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలే తీసుకోవాలని ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరు కావాలని ఆయన కోరారు. 

రాష్ట్రంలో ఇంకా వేసవి రాక ముందే గ్రామాల్లో ప్రజలు మంచినీటికి కటకట లాడుతున్నారనీ రైతులు, సామాన్య ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారనీ జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రజల తరపున గళం వినిపించాలని జగన్ సూచించారు. తరచూ ఎమ్మెల్యేలంతా కలసి మాట్లాడుకుంటూ ఏ తరహా తీర్మానాలు సభలో తీసుకు రావాలో వ్యూహాన్ని రూపొందించుకోవాలని వారిని కోరారు. గత డిసెంబర్‌లో విప్‌ను ధిక్కరించి అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలపై అనర్హులుగా ప్రకటించే అవకాశాలు కనిపించడం లేద నీ కాంగ్రెస్‌కు పరిస్థితులు అనువుగా ఉంటాయనుకుంటేనే అలాంటి నిర్ణయం తీసుకుంటారనిపిస్తోందనీ జగన్ వారితో అన్నారు. 

ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తారా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యలపై దృష్టిని సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అనర్హులుగా ప్రకటించినపుడు ఎన్నికలను ఎదుర్కొందాం అని ఆయన వారితో అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మను కూడా అవసరమైనపుడు తీసుకు వె ళ్లి ఆమె సేవలను కూడా వినియోగించుకోవాలని జగన్ వారితో చెప్పారు. నెల్లూరు జిల్లా కోవూరులో జరిగే ఉప ఎన్నికలో పొరుగు జిల్లాల ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్లాలనీ, పార్టీ అభ్యర్థికి మంచి మెజారిటీ వచ్చేలా కృషి చేయాలనీ ఆయన సూచించారు. ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జి.బాబూరావు, టి.బాలరాజు, ఎం.ప్రసాదరాజు, ధర్మాన కృష్ణదాసు, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, ఎస్.వి.మోహన్ రెడ్డి, పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకరరావు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More