తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుతిన్న నీచమైన చరిత్ర

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు భజన బృందం తమ నాయకుడిని పొగుడుకుంటూ మురిసి పోతోందని దివంగత వై.ఎస్.ఆర్ అభిమాన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మండి పడ్డారు. బాబు హయాంలో లెక్కకు మిక్కిలి కుంభకోణాలకు పాల్పడినట్లు వెల్లువెత్తిన ఫిర్యాదులను అపుడే మరిచారా? అని ధర్మాన ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. చంద్రబాబు తన పాలనలో అడుగడుగునా అవినీతిని పెంచి పోషించి అన్ని రంగాల్లోనూ వ్యవస్థీకృతం చేశారని విమర్శించారు. ‘బాబు జమానా-అవినీతి ఖజానా అంటూ సీపీఎం ఓ పుస్తకాన్ని ప్రచురించి వాడా వాడా పంపిణీ చేసింది. బీజేపీ వంద తప్పులతో ఆయనపై ఏకంగా ఒక చార్జ్‌షీట్‌నే ప్రజల ముందుంచింది. ఏలేరు కుంభకోణం, మద్యం కుంభకోణంపై బాబు ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టులు విచారణను చేపట్టాయి. 

ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ మంత్రివర్గం అనుమతి లేకుండా ఐఎంజీ భారత అనే ఊరూ పేరూ లేని సంస్థకు రెండు వేల ఎకరాల భూమి కట్టబెట్టిన ఘనత చంద్రబాబుది. ఈ వైనంపై కేసులు కూడా దాఖలయ్యాయి. తన బినామీ కోనేరు ప్రసాద్ కోసమే ఏ ప్రజా ప్రయోజనం లేకుండా ఎమ్మార్‌కు 535 ఎకరాలు కేటాయించిన ఘనుడు చంద్రబాబు, అంతే కాదు తన బినామీ వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఓ జీవో వెలువరించి, ఏపీఐఐసీని డమ్మీని చేసిన అక్రమార్కుడు బాబు ’ అని ఆయన ధ్వజమెత్తారు. బాబు ఇచిచన జీవో ఆధారంగానే ఎంజీఎఫ్ అనే సంస్థ ఏర్పడిందని, దాని ఫలితంగానే ఎమ్మార్ కుంభకోణం చోటు చేసుకున్నదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తన నివేదికలో కూడా తేల్చి చెప్పిందని ఆయన వివరించారు. ఇంతటి నీచమైన చరిత్ర సొంతం చేసుకున్న చంద్రబాబునాయుడుకు నిర్దోషి అంటూ కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చాయని ఆయన భజన బృందం అసత్య ప్రచారానికి దిగడం విడ్డూరమని ఆయన అన్నారు. చంద్రబాబు, ఆయన వందిమాగధుల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారనీ బాబు ఘనకార్యాలేవీ తాము మర్చిపోలేదని వారు గుర్తు చేసుకుంటున్నారనీ ఆయన అన్నారు. 

ఏలేరు కుంభకోణం నిగ్గు తేల్చడానికి సోమశేఖర కమిషన్ రంగంలోకి దిగి నిష్పాక్షికంగా విచారణ జరుపుతుండటం చూసి తట్టుకోలేక...భయంతో వణికిపోయిన చంద్రబాబు ఆ కేసులో నిందితుని ద్వారానే హైకోర్టులో కేసు వేయించి స్టే తెప్పించిన రోజులను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఏలేరు కుంభకోణం నుంచి తప్పించుకోడానికి ఆయన పడిన పాట్లూ అన్నీ ఇన్నీ కావ ని ఎద్దేవా చేశారు. మద్యం తయారీ సంస్థలకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిబంధలనకు విరుద్ధంగా రూ.550 కోట్ల మేర అధికంగా చెల్లింపులు జరిపిందని కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని బాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన సారధ్యంలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్ప్‌మెంట్ తేల్చిచెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఈ నివేదిక ఆధారంగానే విచారణ జరుపాలంటూ 2003, డిసెంబర్ 12వ తేదీన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయస్థానం ఏసీబీకి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ విచారణలో వాస్తవాలు బయటకు వస్తే తన దోపిడీ బయట పడుతుందని వణికిపోయిన చంద్రబాబు ఏకంగా తన మంత్రివర్గంలోని సభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు చేతనే హైకోర్టులో పిటిషన్ వేయించి ఏసీబీ కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్న ఘరానా రాజకీయ నేత చంద్రబాబు అని ఆయన వ్యాఖాయనించారు. 

‘ఇలా ఒక్కటేమిటి...కొన్ని పదుల కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాలకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. ఏ కేసులోనూ పూర్తి స్థాయి విచారణ జరగకుండా అడ్డుకున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చోటు చేసుకున్న కుంభకోణాలపై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు పదుల సార్లు నాటి గవర్నర్లను కలిసి ఫిర్యాదు చేశాయి.ఇవన్నీ ప్రజలు మర్చిపోయారని చంద్రబాబు, ఆయన భజన బృందం మురిసిపోతోంది. కానీ, సీఎం కుర్చీ లాక్కోవడం దగ్గరి నుంచి నాటి కుంభకోణాల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సంగతి ఇంకా ప్రజల మనసుల్లో అలాగే ఉంది’ అని ఆయన విమర్శించారు. అందుకే, 2009 ఎన్నికలకు ముందు వైఎస్‌పైనా, ఆయన కుటుంబంపైనా చంద్రబాబు, ఆయన భజన బృందం ఆడిన నాటకాలన్నీ ప్రజలు తిప్పికొట్టి మరోసారి వైఎస్‌కు పట్టం కట్టారనీ మళ్లీ ఐదేళ్లు కావస్తోంది కనుక 2014 ఎన్నికల నాటికైనా ప్రజలు పాత విషయాలు మర్చిపోతారేమోనని చంద్రబాబు, ఆయన భజన బృందం ఆశ పడుతున్నట్లుగా ఉందనీ ధర్మాన వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన అరాచకాలు, ప్రజలపై పన్నుల భారం మోపిన తీరు, గోబెల్స్ ప్రచారంతో మోసగించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చి పోలేరనీ, ఆయనను మళ్లీ తిరస్కరించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారనేది బాబు వందిమాగధులు గుర్తుంచుకుంటే మంచిదని కృష్ణదాస్ హెచ్చరించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More