రానున్న 18 స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ పిలుపునిచ్చారు. భీమ్గల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం కూలిపోతుందని, దీంతో మధ్యంతర ఎన్నికలు ఖాయమన్నారు. కోవూరు ఉపఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజీనామాలు చేయాల్సిందిపోయి నిస్సిగ్గుగా జగన్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.రైతు సమస్యల కోసం టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురైన వారి స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలకు ఏ మాత్రం విలువలున్నా అక్కడ పోటీ పెట్టకూడదన్నారు. ఒకవేళ పోటీ పెడితే కడప ఫలితాలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. అధికార, ప్రతిపక్షాలు ప్రజాసమస్యలపై దృష్టి సారించకుండా జగన్పైనే కుట్రలు, కుతంత్రాలు చేయడంలో మునిగిపోయాయని విమర్శించారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల పారిశ్రామిక వేత్తలు వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సిగ్గు లేకుండా ఏటా ఐదు లక్షల ఉద్యోగాలిస్తానని పిట్టలదొరను గుర్తుకు తెచ్చేలా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావంతో ప్రజలు ఉన్నారన్నారు. బోజ్యానాయక్ ఆత్మబలిదానంతోనైనా కాంగ్రెస్, టీడీపీ నేతలు కళ్లు తెరవాలన్నారు.





0 comments:
Post a Comment