గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 62 రోజులపాటు ఓదార్పుయాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి గుంటూరు జిల్లా అంటే వల్లమాలిన అభిమానం. వైఎస్ ముఖ్యమంత్రి కాగానే అధిక ప్రాధాన్యం ఇస్తూ తరచూ జిల్లాయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించి తనదైన ముద్ర వేసుకున్నారు. నేడు అదే బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపుతున్నారు. తండ్రి గుణాలను పుణికి పుచ్చుకుని ఆయన ఆశయసాధన కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఓదార్పు యాత్రకు వచ్చిన జగన్ స్థానిక సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ప్రత్యక్ష్యంగా చూస్తున్నారు. ప్రజా సమస్యలపై చేస్తున్న అధ్యయనాన్ని పరిశీలిస్తున్న జిల్లా ప్రజలు ఆయనలో భావినాయకుడిని చూసుకుంటున్నారు. జిల్లాలో నేటి నుంచి జగన్ ఓదార్పు యాత్రను పునఃప్రారంభిస్తున్నారు. 

న్యూస్‌లైన్ ప్రతినిధి, గుంటూరు : రాజకీయంగా రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న జిల్లాగా గుంటూరుకు గుర్తింపు ఉంది. ఎందరో రాజకీయ దురంధులు, ఉద్ధండులు జిల్లాను కేంద్రంగా చేసుకొని రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పారు. అలాంటి రాజకీయ చైతన్యవంతమైన జిల్లా.. జగన్‌మోహన్‌రెడ్డి వెన్నెంటే నిలవడంతోపాటు ఓదార్పుయాత్ర ద్వారా సరికొత్త రాజకీయ సమీకరణలకు కూడా నాంది పలుకుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 62 రోజులపాటు ఓదార్పుయాత్ర నిర్వహించిన జగన్ 12 నియోజకవర్గాల్లో పర్యటించి 34 మృతుల కుటుంబాలను పరామర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తట్టుకోలేక మృతిచెందిన ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక కష్టనష్టాలకోర్చి ఓదార్పుయాత్ర సాగిస్తున్నారు. యాత్ర ప్రధాన ఉద్దేశం ఇదే అయినప్పటికీ పట్టుబట్టిన ప్రజాభిమానానికి జగన్ విలువ ఇస్తున్నారు. ప్రజల కోరిక మేరకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తూ, మరోవైపు కష్టాలకడలిలో కొట్టుమిట్టాడుతున్న పేదల బతుకులను దగ్గరగా చూస్తూ అన్నివర్గాలతో మమేకమవుతున్నారు. కేవలం 12 నియోజకవర్గాల్లోనే రికార్డుస్థాయిలో 532 దివంగత వైఎస్సార్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. 

చేనేత కార్మికులు మొదలుకొని ...
మంగళగిరిలో చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా చేనేత మగ్గాల వద్దకు వెళ్లి పరిశీలించడంతో మొదలు, పూలతోటల సాగు రైతుల సమస్యల వరకు అడుగడుగునా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ సమస్యలను స్వయంగా వింటూ.. నేనున్నానంటూ భరోసా ఇస్తూ జిల్లాలో యాత్ర సాగించారు. మంగళగిరిలో చేనేత కార్మికుల సమస్యలు, దుగ్గిరాలలో పసుపు రైతుల సమస్యలు, తెనాలిలో అన్నదాతల ఇక్కట్లు, వేమూరులో జంపని షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు, బాపట్లలో డ్రైన్లలో పూడికతీత పనులు చేయకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, పొన్నూరులో వరి రైతుల సమస్యలు, ప్రత్తిపాడులలో మిర్చి రైతుల ఇబ్బందులు, తాడికొండలో మిర్చి రైతులతోపాటు కూరగాయలు, ఇతర వాణిజ్యపంటల రైతుల ఇబ్బందులు, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేటలలో మిర్చిరైతుల ఇబ్బందులతోపాటు పూలతోటల రైతుల సమస్యలు, కల్లుగీత కార్మికుల ఇక్కట్లు..ఇలా అడుగడుగునా సమస్యలు ఆలకిస్తూ యాత్ర సాగించారు. 

సుదీర్ఘ ప్రస్థానమిలా..
62 రోజుల ఓదార్పుయాత్ర.. 1577.5 కిలోమీటర్ల ప్రయాణం.. 532 దివంగత వైఎస్సార్ విగ్రహావిష్కరణలు.. 34 మృతుల కుటుంబాలకు ఓదార్పు... ఇదీ జిల్లాలో జగన్ నిర్వహించిన ఓదార్పుయాత్ర సంక్షిప్తంగా.. గత అక్టోబర్ 16న మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఓదార్పుయాత్ర నవంబర్ 2వ తేదీ వరకు మొదటివిడత కొనసాగింది. మంగళగిరి, తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి చేసుకొని రేపల్లె పట్టణం చేరుకొని తొలివిడత యాత్రను ముగించారు. మళ్లీ నవంబర్ 16 నుంచి రేపల్లెలో రెండో విడత యాత్ర ప్రారంభించి డిసెంబర్ 2వ తేదీ వరకు, రేపల్లె, బాపట్ల, ప్రత్తిపాడు, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. మళ్లీ డిసెంబర్ 5వ తేదీ నుంచి 16 వరకు కొనసాగించి, జనవరి 5వ తేదీన తాడికొండలో ప్రారంభమైన యాత్ర జనవరి 9వ తేదీ వరకు మూడో విడత యాత్ర కొనసాగి తాడికొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో కొనసాగింది. జనవరి 18 నుంచి 27 వరకు, ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు పెదకూరపాడు, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగి.. మళ్లీ బుధవారం నుంచి నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్లలో యాత్ర ప్రారంభం కానుంది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More