రైతుదీక్షకు భారీ సంఖ్యలో హాజరైన రైతులును చూస్తుంటే తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఎంతటి ఆదరణ ఉందో స్పష్టమవుతుందని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. ఈ ఆదరణని చూసి అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ వారికి ఏమీ అర్దంకాని పరిస్థితి ఏర్పడిందన్నారు. దాంతో వారు రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. రైతు దీక్ష, జగన్ పట్ల ఇంతటి ఆదరణ చూపుతున్న తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రైతు బాంధవుడు జగన్: కొండా సురేఖ
రాష్ట్ర రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి తేచ్చేందుకు రైతు బాంధవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దీక్ష చేపట్టారని కొండా సురేఖ తెలిపారు. రైతే రాజని నమ్మేవాడు మహానేత రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాసనసభలో రైతుల కోసం ప్రభుత్వాన్ని నిలదీసేవారని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచే ఆ మహానేత రైతుల గురించే ఆలోచించారన్నారు.రైతులను జైళ్లకు పంపిన చరిత్ర చంద్రబాబు నాయుడుదని ఆమె విమర్శించారు. రైతులు ఎన్ని బాధలు పడుతున్నా ప్రస్తుత ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి అండగా ఉంటానని జగన్ ధైర్యంతో ఈ దీక్ష చేపట్టారన్నారు. ఈ దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం ప్రకటించి విజయవంతం చేయాలని ఆమె కోరారు.